జొహానెస్బర్గ్: గ్రూప్-డి నుంచి జర్మనీ, ఘనా జట్లు నాకౌట్కు అర్హత సాధించాయి. బుధవారం రాత్రి జర్మనీ 1-0తో ఘనాను ఓడించింది. ఆరు పాయింట్లతో గ్రూప్-డిలో అగ్రస్థానం సాధించి రెండో రౌండుకు చేరుకుంది. ఈ మ్యాచ్లో ఘనా ఓడినా మెరుగైన గోల్ తేడాతో ముందుకెళ్లింది. ఆస్ట్రేలియా 4 పాయింట్లతో ఘనాతో సమంగా నిలిచింది. సెర్బియా గ్రూప్లో చివరి స్థానంలో నిలిచింది. నాకౌట్లో జర్మనీ.. ఇంగ్లాండ్తో, ఘనా.. అమెరికాతో తలపడతాయి. మ్యాచ్లో ఆరంభం నుంచి జర్మనీ దూకుడుగా ఆడింది. ఐతే ఘనా డిఫెన్స్ మెరుగ్గా ఉండటంతో తొలి అర్ధభాగంలో గోల్ నమోదు కాలేదు. రెండో అర్ధభాగంలో జర్మనీ మరింత ధాటిగా ఆడింది. 60వ నిమిషంలో ఓజిల్ 25 గజాల దూరం నుంచి అద్భుతమైన గోల్ కొట్టి జర్మనీకి ఆధిక్యాన్నందించాడు.
జూన్ 24, 2010
ఆగష్టు 12, 2009
భవనంపైనుంచి దూకిన విద్యార్థిని మృతి
విజయవాడ: గొల్లపూడి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో భవనంపైనుంచి దూకిన విద్యార్థిని లోహితారెడ్డి మృతి చెందారు. ఖమ్మంజిల్లాకు చెందిన లోహితారెడ్డి ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. జూన్లో రెసిడెన్షియల్ విద్యార్థినిగా ఉన్న ఆమె మూడు రోజుల క్రితం ఇంటినుంచి వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున భవనంపైనుంచి దూకింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం మృతి చెందింది. హోమ్సిక్ వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
థియేటర్ ప్రమాదాలపై కౌంటర్ దాఖలుకు కోర్టు ఆదేశం
హైదరాబాద్: మగధీర చిత్ర ప్రదర్శన సందర్భంగా జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందిన సంఘటనలపై 15 రోజుల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో సరైన వైరింగ్ కాని, ఫైర్సేఫ్టీకాని లేక సినిమాహాళ్లు మృత్యు కుహరాలుగా, ప్రమాదనిలయాలుగా మారాయని, ప్రజల ప్రాణాలు రక్షించే బాధ్యతను కోర్టు తీసుకోవాలని కోరుతూ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. నూటికి 90 శాతం థియేటర్లలో అగ్నిప్రమాదాల జాగ్రత్తలు పాటించటం లేదని, 780 థియేటర్లలో పొగ బయటకు వెళ్లే వీలు లేదని, 250 సినిమాహాళ్లలో ఫైరింజన్లు ఆపేందుకు స్థలం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు విచారణను 26వ తేదీకి వాయిదావేసింది.
టెక్కలి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎఇన్నకకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవతీపతి మృతి కారణంగా అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. సెప్టెంబర్ 10న అక్కడ ఉప ఎన్నిక జరుగుతుందని, 14న ఓట్లలెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
అక్టోబర్ 7, 2008
ఎన్కౌంటర్ కేసు నిందితులకు న్యాయసహాయం: అమర్సింగ్
పనాజీ: ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో అనుమానితులను కొద్దిరోజుల కిందట జామియానగర్ ప్రాంతంలో ఎన్కౌంటర్ చేసిన కేసులో… అరెస్టు చేసినవారు అమాయకులని విచారణలో తేలితే తాము యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్సింగ్ చెప్పారు. ఈ కేసులో అరెస్టయిన వారికి తమ పార్టీ న్యాయసహాయం అందిస్తుందని ఆయన చెప్పారు. నిజంగా వారు తీవ్రవాదులైతే చంపేయాలనీ, అమాయకులైతే మాత్రం వారికి న్యాయ సహాయం అందించాలని అమర్సింగ్ అన్నారు. ఈ కేసును వాదించేందుకు సీనియర్ న్యాయవాది రామ్జెఠ్మలానీ అంగీకరించారు.
ఆర్థికవృద్ధి కొనసాగుతుంది: చిదంబరం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నా, భారత్ మాత్రం స్థిరమైన వృద్ధి రేటుతోనే ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం చెప్పారు. ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాదికి 8 శాతం వుంటుందనీ, వచ్చే ఏడాదికల్లా అది 9 శాతానికి చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక పరిణామాలు భారత్పై కొద్దిపాటి ప్రభావాన్ని చూపినా, దేశ ఆర్థిక వ్యవస్థ వీటన్నింటినీ తట్టుకుని స్థిరంగా నిలబడిందని ఆయన చెప్పారు.
క్రికెట్కు గుడ్బై చెప్పిన సౌరవ్ గంగూలీ
బంగళూరు: రిటైర్మెంట్పై వస్తున్న వూహాగానాలకు తెరదించుతూ భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్గంగూలీ తన రిటైర్మెంట్ను ప్రకటించారు. ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్ట్ క్రికెట్ తర్వాత తాను క్రికెట్ నుంచి తప్పుకుంటానని గంగూలీ ఉద్వేగంగా చెప్పారు. ఈ సిరీస్ గెలుపుతో కెరీర్ను ముగిస్తానని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ తనకు సహకరించిన వారందరకీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పొత్తులపై తుది నిర్ణయం 12న: కారత్
హైదరాబాద్: ఎన్నికల పొత్తులపై ఈ నెల 12 నుంచీ ప్రారంభం కానున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రకాశ్ కారత్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్, భాజపాల ఓటమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర కమిటీ అభిప్రాయాన్ని తెలుసుకున్నామనీ, వాటిని కేంద్ర కమిటీకి నివేదిస్తామని కారత్ తెలిపారు. పొత్తుల విషయంలో సీపీఐదీ, తమదీ ఒకే అభిప్రాయమని కారత్ అన్నారు.
దుల్హేలో కొనసాగుతున్న కర్ఫ్యూ
దుల్హే: ఉత్తర మహరాష్ట్రలోని దుల్హే పట్టణంలో నిన్న విధించిన కర్ఫ్యూ ఇంకా కొనసాగుతోంది. ఆదివారం నుంచీ జరుగుతున్న మతఘర్షణల్లో ఇప్పటికి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. 126 మంది గాయపడ్డారు. అల్లర్లకు కారకులని అనుమానిస్తున్న 77 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.
భజరంగ్దళ్ తీవ్రవాద సంస్థ: కేంద్రం
పాట్నా: భజరంగ్దళ్ తీవ్రవాద సంస్థ అనీ, ‘సిమి’ని నిషేధించినట్లుగానే ఈ సంస్థనూ నిషేధించడానికి కేంద్రప్రభుత్వం వెనకాడబోదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి షకీల్ అహ్మద్ అన్నారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, భజరంగ్దళ్ కార్యకలాపాల వల్ల రాష్ట్రంలో హింస, భయోత్పాతం ఏర్పడుతున్నాయని నాలుగైదు రాష్ట్రాలు కేంద్రానికి ఓ రిపోర్టు పంపితే కేంద్రం ఆ సంస్థపై నిషేధం విధించే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సంస్థపై నిషేధం విధించడానికి సరిపోయే ఆధారాలు ఇప్పటికే తమ వద్ద ఉన్నాయని షకీల్ అహ్మద్ చెప్పారు.